జీజీహెచ్లో కిడ్నాప్కు గురైన బాలుడు క్షేమం..!

గుంటూరు జీజీహెచ్లో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమంగా దొరికాడు. బాలుడిని అమ్మేయాలనే ఉద్దేశంతోనే నిందితులు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు. జీజీహెచ్లో వార్డ్ బాయ్గా చేస్తున్న హేమవర్ణుడు, అతనితో వివాహేతర సంబంధం ఉన్న పద్మ అనే మహిళ కలిసి బాలుడిని కిడ్నాప్ చేశారు. గుంటూరు జీజీహెచ్ సిబ్బందే బాలుడిని అపహరించారని గుర్తించిన పోలీసులు.. నిందితుల కోసం అన్వేషించారు. గుంటూరులోని నెహ్రూ నగర్లో కిడ్నాపర్లను పట్టుకున్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితులు పద్మ, హేమ వర్ణుడు పోలీసుల అదుపులో ఉన్నారు. నాలుగు రోజుల బాబుని క్షేమంగా తిరిగి తల్లి ఒడికి చేర్చారు పోలీసులు. ఆస్పత్రిలో నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉందన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి.. బాలుడికి అన్ని టెస్టులు చేస్తున్నామని తెలిపారు.
ఈ నెల 13న కాకానికి చెందిన ప్రియాంక జీజీహెచ్లో ప్రసవించింది. నిన్న రాత్రి పిల్లాడు ఏడుస్తూనే ఉండడంతో.. నాయనమ్మ, అమ్మమ్మ వార్డు బయటకు తీసుకు వచ్చారు. కాసేపటి తర్వాత శిశువును అమ్మమ్మ పక్కన పెట్టి నాయన్నమ్మ బాత్రూమ్కి వెళ్లింది. ఐదు నిమిషాల్లో తిరికి వచ్చి చూసేసరికి బాబు కనిపించకపోవడంతో షాక్కి గురయ్యారు. వెంటనే ఆస్పత్రి సిబ్బందిని అప్రమత్తం చేసి వెతికినా జాడ కనిపించలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు అనుమానితుల్ని గుర్తించారు. బాలుడిని బ్యాగ్లో పెట్టుకుని వెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. కిడ్నాప్ చేసింది జీజీహెచ్ సిబ్బందేనని గుర్తించిన పోలీసులు.. నెహ్రూనగర్ వద్ద నిందితులను పట్టుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com