సీఎం జగన్కు రాజధాని నిరసన సెగ
ఏపీ సీఎం జగన్కు రాజధాని నిరసన సెగ తగిలింది. సచివాలయానికి సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తుండగా పెద్ద ఎత్తున రైతులు నినాదాలు చేశారు. జై అమరావతి అంటూ నినదించారు. దీంతో మందడం రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా రైతులు నినాదాలు ఆపలేదు. సీఎం కాన్వాయ్ సాఫీగా వెళ్లడంతో పోలీసులు ఊపరిపీల్చుకున్నారు. కేబినెట్ భేటీ నేపథ్యంలో సచివాలయానికి వెళ్లే దారిలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రైతుల శిబిరాలకు రావొద్దంటూ ఆంక్షలు విధించారు. 3 రాజధానుల శిబిరంలో వాళ్లకు లేని ఆంక్షలు.. తమకెందుకంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. 3 రాజధానుల శిబిరానికి అనుమతి ఇచ్చి.. తమను అడ్డుకునే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేబినెట్ భేటీ సమావేశం సందర్భంగా అమరావతి రైతుల దీక్షా శిబిరంపై ఆంక్షలు విధించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీక్షా శిబిరాలపై పోలీసులు ఆంక్షల్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తుళ్లూరు డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం ఇంత కక్షకట్టినట్టు వ్యవహరించడం సరికాదని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడం సరికాదని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com