Viveka Murder Case: వైఎస్‌. భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌

Viveka Murder Case: వైఎస్‌. భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. భాస్కర్‌రెడ్డిని పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలించనున్నారు. భాస్కర్‌రెడ్డిపై సెక్షన్ 130బి,రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మికి అరెస్టు సమాచారం ఇచ్చి సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు తరలించి సీబీఐ స్పెషల్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. భాస్కర్‌రెడ్డి ఫోన్‌ను సీబీఐ అధికారులు సీజ్‌ చేశారు.

వివేకా హత్య కేసులో అవినాశ్‌ను అధికారులు ఇప్పటికే నాలుగుసార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం అవినాశ్‌ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ కడపలో అరెస్టు చేసింది. వివేకా హత్యకు ముందు భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉదయ్‌ ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా సీబీఐ గుర్తించింది. సాక్ష్యాలు ధ్వంసం చేశాడన్న ఆరోపణలతో ఉదయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్‌ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో అవినాశ్‌ను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని అవినాష్‌రెడ్డి ఇంటికీ సీబీఐ అధికారులు వెళ్లినట్లు ప్రచారం జరిగింది.

వివేక హత్య కేసులో రెండు రోజుల క్రితం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్.వివేకానందారెడ్డి మర్డర్‌కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు న్యాయమూర్తి. వెంటనే మాసబ్‌ట్యాంక్‌లోని జడ్జి ఇంటి నుండి ఆయన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి అతనికి ఈనెల 26 వరకూ రిమాండ్‌ విధించారు. వైఎస్‌. వివేకానందారెడ్డి హత్యకేసులో ఉదయ్‌కుమార్‌ను విచారణ కోసం సీబీఐ కస్టడీ పిటిషన్‌ వేసింది. మరోవైపు ఉదయ్‌కుమార్‌ తరఫున నోటీసులు తీసుకున్న ఆయన న్యాయవాదులు బెయిల్‌ మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను కోరారు. అయితే సోమవారం కస్టడీ, బెయిల్‌ పిటిషన్లపై విచారణ చేస్తామని కోర్టు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story