CBN: సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి

ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దుబాయ్.. మన అభివృద్ధికి మార్గదర్శం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిలాషించారు. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో పాల్కొన్న ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. సంక్షోభాలనూ అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమన్న సీఎం... నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. యూఏఈతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. యూఏఈ జనాభాలో 40 శాతం మంది భారతీయులే అన్నచంద్రబాబు.. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్తో పరిస్థితి మారిందని గుర్తు చేశారు. సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు రావడం చర్చలకు ప్రాధాన్యత చేకూర్చిందని తెలిపారు. దుబాయ్ ను చూస్తుంటే తనకు ఆసూయ వేస్తుంటుందన్న చంద్రబాబు... దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్కు అపార అవకాశాలు వచ్చాయన్నారు. ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించామన్న చంద్రబాబు... విజన్ 2020తో రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచామని... వికసిత్ భారత్ ద్వారా 2047 ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు.
అన్ని సేవలు ఆన్లైన్లోనే
ఏపీలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
ఇన్వెస్టోపియా సమ్మిట్ ఎందుకంటే?
ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్ సదస్సు యూఏఈ ఆధ్వర్యంలోని ఇన్వెస్టోపియా గ్లోబల్ టాక్స్ సిరీస్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ఇది గతంలో న్యూయార్క్, జెనీవా, న్యూఢిల్లీ, ముంబై, కైరో, రబాట్, హవానా, మిలన్ వంటి నగరాలలో జరిగిన ఈవెంట్ల సమాహారంలో ఒకటి. ఈ సమ్మిట్లో ఆర్థిక, సాంకేతిక, టూరిజం, ఫ్యామిలీ బిజినెస్, ఇ-కామర్స్ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మౌలిక సదుపాయాలు, మరియు నైపుణ్యం ఉన్న మానవ వనరులను హైలైట్ చేస్తూ చర్చలు సాగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com