Chandrababu Case: ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Chandrababu Case: ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
విచారణ శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు

ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల విషయంలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలే వెనుకాడతాయని అలాంటిది సీఐడీ ఎలా మంచి చెడుల్ని నిర్ణయిస్తుందని... చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్‌ అన్నారు. ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టులో వాదనలు వినిపించిన ఆయన.. పేదల కోసమే గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడం ఎలా తప్పవుతుందని అడిగారు. అనంతరం ఏజీ వాదనల కోసం విచారణ శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గనుల శాఖ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు పలువురిపై నవంబరు 1న సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూచంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. విచారణలో పిటిషనర్‌ తరఫున సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. ఇసుకను నిత్యావసర వస్తువు నిర్వచనం పరిధిలోకి తీసుకురావాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తుచేశారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలపై భారాన్ని తగ్గించేందుకే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దానికి క్యాబినెట్‌ ఆమోదం ఉందని తెలిపారు. ఉచిత ఇసుక విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు.


ఇసుకను ఇతరులకు విక్రయించడానికి అనుమతించలేదని నిర్మాణ అవసరాలకే వినియోగించాలనడంతో రాజకీయ జోక్యం లేకుండా పోయిందని సిద్ధార్థ అగర్వాల్‌ కోర్టుకు నివేదించారు. మధ్యవర్తుల ప్రస్తావనే లేకుండాగుత్తాధిపత్యాన్ని కట్టడి చేయగలిగారన్నారు. బడా వ్యాపారులు సొమ్ము చేసుకోకుండా నియంత్రించగలిగారని తెలిపారు. ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ను నియమించి... పర్యావరణ అనుమతులు పొందిన ఇసుక రేవులలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చారని న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్‌ గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపును నిషేధించారని తెలిపారు. చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు.

ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన సొమ్మును కాదనుకొని సాధారణ ప్రజల ప్రయోజనం కోసం ఉచిత ఇసుక ఇవ్వడం ఎలా తప్పవుతుందని సిద్ధార్థ్ అగర్వాల్‌ ప్రశ్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌... కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన ఆ కమిటీ ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. సీఐడీ ఆ విషయాన్ని దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఎంపిక చేసుకున్న కొన్ని అంశాలనే తెరపైకి తెస్తోందని సిద్ధార్థ్ అగర్వాల్‌ వాదించారు. రాజకీయ కక్షతో పిటిషనర్‌పై ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదు చేస్తోందన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17-A ప్రకారం గవర్నర్‌ నుంచి అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని వివరించారు. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలన్నీ సీఐడీ వద్ద ఉన్నాయన్నారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ ప్రతి వాదనల కోసం విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.

Tags

Read MoreRead Less
Next Story