నాలుగు నెలల్లో 80శాతానికి పైగా అప్పు : చంద్రబాబు
రైతుల పాలిట జగన్ ప్రభుత్వ నిర్ణయాలు గుదిబండగా మారాయని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న ప్రభుత్వ నిర్ణయం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయం రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని అన్నారు. రైతుల్ని నమ్మించి మోసం చేస్తారా అని ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మొదట ఎన్టీఆర్ భావించారని చెప్పారు. ప్రభుత్వం అప్పు తెచ్చుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్... నగదు బదిలీ పేరుతో ప్రభుత్వం డ్రామాలాడుతోందని విరుచుకుపడ్డారు. ఉచిత విద్యుత్ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు అని చంద్రబాబు అన్నారు. విద్యుత్ సంస్కరణలకు నాంది పలికింది టీడీపీయేనని అన్నారు.
నాలుగు నెలల్లోనే 80శాతానికి పైగా అప్పు చేశారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జగన్ చేతగానిక తనంతో ఏపీ పరువు, ప్రతిష్టలు పోయాయని అన్నారు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు... ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. గంటకు 9 కోట్ల రూపాయల అప్పు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారని విమర్శించారు. అమరావతి రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో బెదిరింపు ధోరణి అనుసరిస్తోందని అన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com