CHIRU: జనసేనకు చిరు భారీ విరాళం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన విజయం కాంక్షిస్తూ ప్రముఖ సినీ నటుడు చిరంజీవి 5కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. హైదరాబాద్ ముచ్చింతల్ లోని విశ్వంబర షూటింగ్ లోకేషన్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ , ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మర్యాద పూర్వకంగా చిరంజీవిని కలిశారు.
ఆత్మీయ ఆలింగనంతో చిరంజీవి సోదరులకు స్వాగతం పలికారు. సమాజం కోసం ఖర్చు పెట్టే తన తమ్ముడికి కొంతైనా ఉపయోగపడాలనే విరాళం ఇచ్చినట్లు చిరంజీవి ఎక్స్ లో పోస్టు చేశారు. ఎన్నికల నిర్వహణకు విరాళాన్ని ఇచ్చిన చిరంజీవికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ లేఖను విడుదల చేసింది.
చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.కొద్దిసేపు ముగ్గురూ మాట్లాడుకున్నారు.నీ వెనక నేనున్నానంటూ చిరంజీవి భరోసా ఇచ్చారు. అనంతరం విరాళానికి సంబంధించిన చెక్కులను అందించి ఆశీర్వదించారు.
‘‘అందరూ అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా, తన సంపదని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్. అతని లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించాను’’అని చిరంజీవి తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com