CM Chandrababu: ఆర్టీజీపై సీఎం ఫోకస్..

CM Chandrababu: ఆర్టీజీపై సీఎం ఫోకస్..
X
ప్రజల సమగ్ర డాటా అనుసంధానం ద్వారా మెరుగైన పౌర సేవ‌లు- సీఎం

రాష్ట్ర ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వ‌న‌రుగా ఉండాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స‌చివాల‌యంలో శుక్రవారం రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ (ఆర్టీజీ)పై సీఎం స‌మీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్‌లో జ‌రుగుతున్న డాటా ఇంటిగ్రేష‌న్ ప‌నులను గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీజీ శాఖ కార్యద‌ర్శి ఎస్‌. సురేష్ కుమార్‌, ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్‌లు ఆర్టీజీఎస్ ద్వారా చేప‌డుతున్న డాటా ఇంటిగ్రేష‌న్ ప‌నుల ప్రగ‌తి గురించి ముఖ్యమంత్రికి వివ‌రించారు. ప్రభుత్వంలో మొత్తం 40 శాఖ‌లున్నాయ‌ని, 128 విభాగాధిప‌తుల వ‌ద్ద 178 డాటా ఫీల్డుల నుంచి 500 టీబీల డాటా ల‌భ్యమ‌వుతుంద‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆర్టీజీ అనేది ప్రభుత్వానికి రియ‌ల్ టైమ్ డాటా అందించే ఏకైక వ‌న‌రుగా ప‌నిచేయాల‌ని అన్నారు. అన్ని విభాగాల్లోని డాటాను ఒక వేదిక‌పైకి తీసుకొచ్చి అనుసంధానం చేసి, ప్రభుత్వ ప‌థ‌కాలు, కార్యక్రమాలను డాటా ద్వారా విశ్లేషించాల‌న్నారు.

ఆర్టీజీఎస్ అనేది ప్రభుత్వానికి ఒక స‌దుపాయ సాధ‌నంగా, అన్ని వేళ‌లా స‌హాయ‌కారిగా ప‌నిచేయాల‌ని సీఎం చంద్రబాబు సూచించారు. పౌరులు ఇప్పటికి కూడా త‌మ‌కు కావాల్సిన ప్రాథ‌మిక‌మైన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, నివాసం, ఆదాయం, విద్యార్హత లాంటి ధృవీక‌ర‌ణ ప‌త్రాల కోసం అధికారులు, కార్యాల‌యాల చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేయాల్సి వ‌స్తోంద‌ని ఈ విధానం మారాల‌న్నారు. ప్రభుత్వం ప్రజ‌ల‌కు వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను అందుబాటులోకి తెచ్చి వారికి కావాల్సిన సేవ‌ల‌న్నీ సులభంగా అందేలా చేయ‌నుంద‌ని.. ఆ దిశ‌గా ప‌ని చేయాల‌న్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40 ల‌క్షల మంది పౌరులకు సంబంధించి డాటా లేద‌ని అధికారులు వివరించారు. ఈ డాటాను స‌త్వరం సేక‌రించి అనుసంధానించే చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని గృహాల‌ను జీపీఎస్ ద్వారా అనుసంధానం చేయాల‌ని ముఖ్యమంత్రి సూచించారు.


Next Story