- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- ఏపీ ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్...
ఏపీ ప్రభుత్వ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

ఏపీ ప్రభుత్వ తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. గతంలోలా ఏపీ తన పద్ధతిని మార్చుకోకుంటే కుదరదని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ తెలంగాణ వైఖరిని స్పష్టం చేశారు. రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు, వాటాల గురించి అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోపాటు, దిగువ రాష్ట్రమైన ఏపీ సీఎం జగన్కు తెలంగాణ వైఖరిని స్పష్టం చేశారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే, తాము కూడా అలంపూర్ - పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతామని, తద్వారా రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని సీఎం కేసీఆర్ తేల్చేశారు.
నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో చేసినట్లు తన ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదన్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించి, తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే, తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందని గుర్తు చేశారు. భారత యూనియన్ లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైనవాటాను పొందే హక్కు ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరతామని సీఎం స్పష్టం చేశారు.
కృష్ణానదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని ఎన్నిసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. కేంద్రమే ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్. ఆయకట్టు లేకుండా నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్ ను తెలంగాణ ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా పోతిరెడ్డి పాడును మరింత విస్తరించడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తక్షణమే పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.. అంతర్ రాష్ట్ర జలవివాదాల చట్టం కింద ఫిర్యాదుల స్వీకరణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 2014లోనే కేంద్రానికి లేఖ రాశామని.. ఇందుకు సంబంధించి కేంద్రం ఇప్పటి వరకు ఎ లాంటి చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అయితే, తెలంగాణ పిటిషన్ కారణంగా తాము ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నట్లు కేంద్ర మంత్రి షెకావత్ సమావేశంలో ప్రస్తావించారు.. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ కేంద్రం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తే సుప్రీంకోర్టులో కేసును వెనక్కు తీసుకోవడానికి అభ్యంతరం లేదని తెలిపారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com