అప్పులు తీర్చలేక.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో భార్యాభర్తలు మృతి చెందగా కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
శుక్రవారం 'వరలక్ష్మీ వ్రతం' పర్వదినాన కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడంతో భార్య, భర్తలు మరణించారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక భర్త, భార్య, కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం గొరపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు, వాటి కారణంగా తరచూ కుటుంబంలో వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కుటుంబ పెద్ద తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యమనుకున్నారు. కిరాణాషాపు నడుపుతున్న కె సత్యనారాయణ (52), అతని భార్య సూర్య కుమారి (45), కుమార్తె నీలిమ (20) పురుగుల మందు తాగి ఆత్యహత్యకు ప్రయత్నించారు. కుమారుడు సంతోష్ నగరంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఆ సమయంలో అతడు ఇంటి వద్ద లేడు.
బాధితులను చికిత్స నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సత్యనారాయణ, అతని భార్య సూర్యకుమారి మృతి చెందారు. ఈ మేరకు పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com