VIVEKA CASE: వైసీపీ పెద్దలు రాజీకి రమ్మంటున్నారు

VIVEKA CASE: వైసీపీ పెద్దలు రాజీకి రమ్మంటున్నారు
వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సంచలన వ్యాఖ్యలు... వైసీపీ పెద్దలు ప్రలోభ పెడుతున్నారన్న దస్తగిరి

వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి మరోమారు సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యను అడ్డం పెట్టుకుని గత ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్ ఈసారీ అదే కుట్రతో పావులు కదుపుతున్నారన్నారు. వివేకా హత్యలో తాను తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్ గా మారితే ఇపుడు రాజీకి రావాలని వైసీపీ పెద్దలు ప్రలోభ పెడుతున్నారని ఆక్షేపించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.... ఐదేళ్లుగా పులివెందుల వైసీపీ నాయకులకు పక్కలో బల్లెంలో మారారు. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న అతనిపై 4 నెలల కిందట యర్రగుంట్ల, వేముల పోలీసులు అట్రాసిటీ, దాడి కేసులు నమోదు చేసి కడప జైలుకు పంపారు. 4 నెలలు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరికి రెండు వేర్వేరు కేసుల్లో హైకోర్టు, కడప జిల్లా కోర్టు బెయిలు మంజూరు చేయడంతో శుక్రవారం నుంచి విడుదలయ్యారు. సాయంత్రం 4 గంటల నుంచే అతని భార్య షబానా, పిల్లలు జైలు వద్ద దస్తగిరి కోసం ఎదురు చూశారు.

జైలు నుంచి బైటకు వచ్చిన తర్వాత నేరుగా ఆవరణలోని అతిథి గృహంలో ఉన్న CBI అధికారుల వద్దకు వెళ్లి దస్తగిరి సమాచారం అందించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన దస్తగిరి మరోసారి సీఎం జగన్, అవినాష్ రెడ్డిలపై ఆరోపణలు చేశారు. వివేకా కేసులో అప్రూవర్ గా మారి వారికి అడ్డం వస్తున్నాననే ఉద్దేశంతోనే లేనిపోని కేసులు పెట్టి జైల్లో పెట్టారని పేర్కొన్నారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు హింసించారన్నారు. పులివెందులలో తన భార్యను బెదిరించారన్నారు.వివేకా హత్యలో తప్పు చేసినందుకు ప్రాయశ్చిత్తం పొంది అప్రూవర్ గా మారానని ఇపుడు మళ్లీ తన చేత తప్పు చేయించేలా...జగన్, అవినాష్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని దస్తగిరి తెలిపారు. కడప జైల్లో తనకు భారీగా డబ్బు ఆశ చూపి ప్రలోభ పెట్టేందుకు యత్నించారని వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు జైలు నుంచి దస్తగిరి బయటికి రాగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీసులు బందోబస్తుకు వచ్చారు .పులివెందులలోని ఇంటికి చేరుకోగానే అక్కడా పహారా ఏర్పాటు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story