మోదీ ప్రధాని అయ్యాక అభివృద్ధిలో వేగం పెరిగింది : నరేంద్ర సింగ్ తోమర్

గ్రామాలు, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు తోమర్ బదులిచ్చారు. వ్యవసాయ భూములకు సంబంధించిన హక్కులు రైతుల దగ్గరే ఉంటాయన్నారు. భూములు కోల్పోయిన రైతులకు పట్టణాల స్థాయిలోనే నష్టపరిహారం అందిస్తామన్నారు. కొవిడ్ 19 వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి లోనైందన్నారు. ఒకప్పుడు దేశంలో ఆహార కొరత ఉండేదని.. ఇప్పుడు దిగుబడులు పెరిగాయన్నారు.
అంతకు ముందు ఉదయం సభ ప్రారంభమవగానే.. విపక్ష ఎంపీలు సాగు చట్టాల అంశాన్ని లేవనెత్తారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ఇప్పుడు రైతులు.. ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారందరినీ కేంద్రం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తోందని.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని అవమానించడంపై యావత్ దేశం విచారం వ్యక్తం చేస్తోందన్నారు. అయితే ఆ ఘటనకు కారణమైన వారిని వదిలేసి రైతులను అరెస్టు చేయడం సరికాదన్నారు. జాతీయ జెండాను అవమానించిన దీప్ సిద్ధూ ఎక్కడున్నాడని ప్రశ్నించారు సంజయ్ రౌత్. ప్రభుత్వం ఆయనను ఎందుకు పట్టుకోలేకపోతోందని ప్రశ్నించారు. రైతుల ఆందోళనపై దుష్ప్రచారం చేయడం సరికాదని కేంద్రంపై మండిపడ్డారు.
రైతులు ఢిల్లీలోకి రాకుండా సరిహద్దుల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టడం రోడ్డుపై మేకులు ఏర్పాటుచేయడంపై బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా మండిపడ్డారు. ఇలాంటివన్నీ చైనా, పాకిస్థాన్ సరిహద్దులో చేయాల్సిందని అది కూడా మనదేశానికి మంచిదికాదన్నారు. గత రెండు నెలలుగా రోడ్డెక్కిన రైతుల్ని ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందన్నారు. వారికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయడం మానవహక్కుల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం అహంకారాన్ని పక్కనబెట్టి రైతుల సమస్యలను విని సాగు చట్టాలను రద్దు చేయాలని సూచిస్తూ సర్కార్పై విరుచుకుపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com