AP : కర్నూలులో ఎండుతున్న బావులు.. జనం ఇబ్బందులు

కర్నూలు జిల్లా.. ఆలూరు ప్రజల గొంతులు త్రాగు నీరు లేక ఎండుతున్నాయి. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటిపోవడంతో తాగునీరు లేక గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. చేతి పంపులు సైతం దిష్టిబొమ్మల్లా మారాయి. పల్లెల్లో దాహం తీర్చే నాధుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
గత్యంతరం లేక దాహం తీర్చుకునేందుకు వ్యవసాయ భూములను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ గ్రామీణులు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. మండల కేంద్రమైన ఆలూరుతోపాటు పెద్దహోతురు, హులేబీడు, అరికెర, కమ్మరిచేడు, మనేకుర్తి, ఆస్పరి, గూల్యం, హత్తి బెలగల్, తదితర గ్రామాల్లో 15 రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా కావడం లేదు. తమ గ్రామానికి తాగునీరు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు తమ దాహార్తి తీరుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యానికి గ్రామాలకు తాగునీటి అవస్థ ఓ శాపంగా మారింది. జిల్లాకు పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం ప్రజలకు తాగునీటి సమస్య ప్రతి ఏడాది వెంటాడుతూనే ఉంది. ప్రతి ఏడాది మండలానికి తాగునీటి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నామని అధికారులు, పాలకులు చెబుతున్నా తాగునీటి కొరతలో మార్పు రావడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com