రాజధానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం : చంద్రబాబు

రాజధానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం : చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు.. ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5 ఏళ్లు పూర్తైందని ఆయన గుర్తు చేశారు..

వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు.. ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగి నేటికి 5 ఏళ్లు పూర్తైందని ఆయన గుర్తు చేశారు. విభజన నష్టాన్ని అధిగమించి,13 జిల్లాల అభివృద్ధికి కావాల్సిన సంపద సృష్టి కేంద్రంగా, యువత ఉద్యోగ అవకాశాల కార్యస్థానంగా దీని నిర్మాణం తలపెట్టామన్నారు. మూడున్నర సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిన రాజధాని నిర్మాణ పనులను గత ఏడాదిన్నరగా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

వేలాది కూలీలు, భారీ మెషీనరీతో, వాహనాల రాకపోకలతో కోలాహలంగా నిర్మాణ పనులతో కళకళలాడిన అమరావతిని స్తబ్దుగా, నిస్తేజంగా చూస్తుంటే బాధేస్తోందన్నారు. పోటీపడి అభివృద్ధి చేస్తారని ఆశించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నీరుగార్చడం ప్రజాద్రోహమన్నారు. శంకుస్థాపన వేడుకకు హాజరైన ప్రధాని, దేశ, విదేశీ ప్రముఖుల సందేశాల స్ఫూర్తిని కాలరాశారని మండిపడ్డారు.

వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో.. చట్ట విరుద్ధంగా.. రాష్ట్ర రాజధాని బృహత్తర యజ్ఞాన్ని భగ్నం చేయడం తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. 13వేల గ్రామాలు, 3వేల వార్డుల నుంచి తెచ్చిన పవిత్ర మట్టిని, పుణ్య జలాలతో అభిషేకించి శక్తి సంపన్నం చేసిన ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం సరైంది కాదన్నారు. మన రాష్ట్ర రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పౌరుడి కర్తవ్యం అంటూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story