APSRTC: ఆర్టీసీ బస్సు దగ్ధం.. 60 మంది ప్రయాణీకులు సురక్షితం
APSRTC: 60 మంది ప్రయాణికులతో ఆ బస్సు బయల్దేరింది. అంతలోనే ఇంజిన్ కాలుతున్న ఆనవాళ్లు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.
కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజిన్లో నుంచి మంటలు రావడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. గుడివాడ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో విద్యార్ధులు, ప్రయాణీకులతో సహా మొత్తం 60 మంది ఉన్నారు.
ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశారు. ప్రయాణీకులందరినీ బస్సు దిగిపొమ్మని అలెర్ట్ చేశారు. దాంతో ప్రయాణీకులు ప్రాణాలు దక్కితే చాలనుకుని తమ విలువైన వస్తువులను వదిలేసి దిగిపోయారు.
దాంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. బ్యాగుల్లో దాచుకున్న నగదు, బంగారం, దుస్తులు, ఇతర వస్తువులు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com