పండుగ వేళ ఏపీలో అగ్నిప్రమాదాలు

దీపావళి పండుగ వేళ ఏపీలోని పలు జిల్లాల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టపాసులు పడి షాపులు, పూరిళ్లు దగ్ధమయ్యాయి. నెల్లూరు ట్రంక్ రోడ్లోని మహేశ్వరి హోటల్ లాడ్జి, బేబీ టాయ్స్ సెంటర్లలో అగ్నిప్రమాదం జరిగింది. రెండు ఫైరింజన్లు మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి.
కృష్ణా జిల్లా గన్నవరంలో టపాసులు పడి ఓ ఇల్లు ఆహుతైంది. ఈ ఘటన గౌడపేటలో చోటుచేసుకుంది. ఇంట్లోని వారు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైరింజన్లు మంటలు అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీనరసాపురంలో ఓ కోళ్ల ఫారం అగ్నికి ఆహుతైంది. బాణసంచా పడే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. సుమారు 500 కోళ్లు మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అటు.. పెద్దాపురం బంగారం గుడి వీధిలో తారా జువ్వ పడి పూరిళ్లు కాలిపోయింది.
విజయనగరం జిల్లా గుర్ల మండలం తాతావారి కిట్టలిలో అపశృతి చోటుచేసుకుంది. టపాసులు పడి 10 కచ్చా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com