నాలుగోసారి టీటీడీ బోర్డు మెంబర్గా కృష్ణమూర్తి వైద్యనాథన్
టీటీడీ బోర్డు సభ్యులను జగన్ సర్కారు ప్రకటించింది.ప్రతిష్టాత్మక పదవుల్లో సిఫార్సులకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న విమర్శలు భారీ ఎత్తున్న వస్తున్నాయి. చెన్నైకి చెందిన ఆడిటర్ కృష్ణమూర్తి వైద్యనాథన్.. టీటీడీ బోర్డులో నాలుగోసారి ఆయన సభ్యత్వం సంపాదించారు. ఇదెలా సాధ్యమైందన్న ప్రశ్న అన్ని వర్గాల నుంచి వస్తోంది.
టీటీడీబోర్డు సభ్యత్వానికి దేశ వ్యాప్తంగా ఎక్కడలేని డిమాండు ఉంది.జీవితకాలంలో ఒక్కసారైనా టీటీడీ సభ్యులుగా ఉండాలని తహతహలాడే నాయకులూ ఉన్నారు. వెంకన్న ఆలయంలో సభ్యుడిగా ఉండాలని అవసరమైతే తమకున్న స్థాయిలో సిఫార్సులు చేయిస్తారు. స్వామిసేవను అటుంచి, ఈ పదవిని చాలామంది పరపతికే వినియోగిస్తారు. తమకుండే ప్రొటోకాల్ను వినియోగించుకుని కార్పొరేట్ దిగ్గజాలకు దగ్గరవుతున్నారు. ఇలా పెంచుకునే పరపతితో తమ వ్యాపారాన్ని పెంచుకుంటారన్న విమర్శలు ఉన్నాయి. అందుకే టీటీడీ బోర్డులో పదవికి అంత డిమాండు. కేబినెట్ కూర్పు అయినా ఈజీగా చేయొచ్చు కానీ టీటీడీ బోర్డు సభ్యుల నియామకం మాత్రం అంత ఈజీగా చేయలేం అని సాక్షాత్తు సీఎంలే అన్న సందర్భాలు కూడా లేకపోలేదు. అంతటి డిమాండ్, సిఫార్సులు ఉంటాయి ఈపదవికి.
అయితే ఇంతటి డిమాండ్ ఉన్నా.. కృష్ణమూర్తి వైద్యనాథన్కి మాత్రం ఆ అవకాశం ఎలా వస్తూనే ఉందన్న అనుమానాలు ఉన్నాయి. చెన్నైకి చెందిన ఈ ఆడిటర్ 2015 ఏప్రిల్లో తొలిసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు.అయితే 2018లో స్థానం దక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అదే ఏడాది సెప్టెంబరులో బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ వరుసగా అవకాశం వస్తోంది. 2021 బోర్డులో ఆయనకు అవకాశం రాలేదు. కానీ కొద్దిరోజులకే బోర్డులోని వేమిరెడ్డి ప్రశాంతిని ఢిల్లీ ఎల్ఏసీ ఛైర్పర్సన్గా నియమించి ఆమె స్థానంలో సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు.
మొత్తానికి 2015 నుంచి ఇప్పటివరకూ 8 ఏళ్లలో ఆరేళ్లు ఆయన టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. మళ్లీ ఇప్పుడూ అవకాశం దక్కింది. తొలిసారి కేంద్రం మంత్రి సిఫార్సుతో వచ్చారనే ప్రచారం ఉంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చకా కేంద్రంలోని కీలకమంత్రి సిఫార్సులతో కృష్ణమూర్తి టీటీడీ సభ్యుడిగా వరస అవకాశాలను పొందుతున్నారన్న చర్చ జరుగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com