అర్థరాత్రి సమయంలో ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి ఆయిల్ చోరీ..

తూర్పుగోదావరి జిల్లాలో ఆయిల్ దొంగల ముఠా బెంబేలెత్తిస్తోంది. ఏకంగా ఓఎన్జీపీ పైప్లైన్ నుంచే ఆయిల్ను లాగేస్తున్నారు. జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పలో ఆయిల్ కేటుగాళ్లు బరితెగిస్తున్నారు. ఓఎన్జీసీ లైన్ నుంచి పైపుల ద్వారా ఆయిల్ను దోచేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో డబ్బాల్లోకి ఎక్కిస్తూ వాహనాల్లో తరలిస్తున్నారు.
ఇప్పటి వరకు ఆయిల్ ట్యాంకర్ల నుంచి ఇంధనాన్ని దోచుకెళ్లడమే చూశాం. ఈ దొంగల ముఠా మరింత అడ్వాన్సుగా ఆలోచించింది. ఏకంగా సముద్ర గర్భం నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ను తోడుతున్న ఓఎన్జీసీ సంస్థ వద్దకే వెళ్లారు. ఆ సంస్థ పైప్లైన్కు ఓ పైపును తగిలించి.. అందులోంచి ఆయిల్ను చోరీ చేస్తున్నారు.
మోటార్ పెట్టి మరీ పైప్లైన్ నుంచి ఆయిల్ను లాగేస్తున్నారు. రాత్రికి రాత్రి ఆయిల్ను డబ్బాల్లో నింపుకుంటూ... తెల్లవారే సరికి ఊరు దాటించేస్తున్నారు. అందునా, ఒకటి రెండు డబ్బాలు కాదు. పదుల సంఖ్యలో ప్లాస్టిక్ డబ్బాలను తెచ్చి...వెహికల్లో ఎక్కించుకెళ్తున్నారు.
ఓఎన్జీపీ పైప్లైన్ వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఖతమే. మంటలు అంటుకుంటే మరో బ్లోఔట్ తప్పదు. అందుకే, స్థానికులు అప్రమత్తమయ్యారు. ఆయిల్ చోరీ చేస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి.. ఆయిల్ చోరీ ముఠాను అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com