AMARAVATHI: దేశానికే గేమ్ ఛేంజర్ అమరావతి క్వాంటం వ్యాలీ

ఒకప్పుడు వ్యవసాయ భూములతో నిండిన తుళ్లూరు ప్రాంతం… నేడు ప్రపంచ సాంకేతిక పటంలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్పై నిలపాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్, పరిశోధనలకు కేంద్రంగా నిలవనున్న అమరావతి క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర ఐటీ చరిత్రలోనే కాకుండా, దేశ టెక్నాలజీ రంగంలోనూ ఒక మైలురాయిగా నిలవనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. కేంద్రం–రాష్ట్రం కలిసి భవిష్యత్తు టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టేందుకు ఇది నిదర్శనమని ఈ వేదిక స్పష్టం చేసింది.
క్వాంటం వ్యాలీ అంటే ఏమిటి?
అమరావతి క్వాంటం వ్యాలీ భారతదేశంలోనే తొలి పూర్తి స్థాయి క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీ హబ్గా రూపుదిద్దుకోనుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో, క్వాంటం రంగంలో ప్రపంచంలోని టాప్–5 కేంద్రాల్లో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 50 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రధాన భవనం సుమారు 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 3డీ ప్రింటింగ్, ప్రీ–ఇంజినీరింగ్ వంటి అత్యాధునిక నిర్మాణ సాంకేతికతలతో భవనాన్ని నిర్మించనుండటం విశేషం.
గ్లోబల్ దిగ్గజాల భాగస్వామ్యం
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు కీలక పాత్ర పోషించనున్నాయి. IBM, TCS, L&T వంటి సంస్థలు అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి. IBM, TCS కలిసి ఇక్కడ ప్రత్యేకంగా క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ కేంద్రం ద్వారా క్వాంటం కంప్యూటింగ్, అల్గారిథమ్స్, అప్లికేషన్లపై పరిశోధనలు, ఆవిష్కరణలు జరుగనున్నాయి. రానున్న కొద్ది సంవత్సరాల్లో క్వాంటం టెక్నాలజీలో కనీసం లక్ష మంది నిపుణులను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.
నోబెల్ సాధిస్తే రూ.100 కోట్ల బహుమతి
పరిశోధకులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి ఎవరైనా క్వాంటం రంగంలో నోబెల్ బహుమతి సాధిస్తే, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రూ.100 కోట్ల నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించడం విశేషం. ఇది దేశంలోని పరిశోధక వర్గాలకు పెద్ద ప్రోత్సాహంగా నిలవనుంది.
క్వాంటం వ్యాలీ ముఖ్యాంశాలు
అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్లో దేశంలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. 156 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్తో పనిచేసే ‘IBM క్వాంటం సిస్టమ్–2’ ఇక్కడ ఏర్పాటు కానుంది. ఇది వాస్తవ రూపం దాల్చితే భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్గా నిలవనుంది. టీసీఎస్ సహకారంతో లైఫ్ సైన్సెస్, క్రిప్టోగ్రఫీ, మెటీరియల్స్ సైన్స్, ఎనర్జీ ఆప్టిమైజేషన్ వంటి రంగాల్లో క్వాంటం అల్గారిథమ్స్, అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించనున్నారు. విద్యా సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమల కోసం ప్రత్యేక ఎకోసిస్టమ్ను కూడా అభివృద్ధి చేయనున్నారు.
అమరావతిలో ఏమేమి ఏర్పాటవుతాయి?
క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన కేంద్రాలు, స్టార్టప్లకు ఇంక్యుబేషన్ సెంటర్లు, శిక్షణా కేంద్రాలు, హైటెక్ ల్యాబ్స్, డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఐటీ కంపెనీలకు అవసరమైన పూర్తి స్థాయి మౌలిక వసతులు ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి.ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. దేశీయ–అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఫైనాన్షియల్ మోడలింగ్, హెల్త్కేర్, పర్యావరణ సాంకేతికతల్లో అధునాతన క్వాంటం అప్లికేషన్లు రాష్ట్రంలోనే అభివృద్ధి కానున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీని రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. తొలి దశలో మౌలిక వసతులు, విద్యా రంగం, పైలట్ ప్రోగ్రామ్లపై దృష్టి పెట్టనున్నారు. రెండో దశలో క్వాంటం టెక్నాలజీ వాణిజ్యీకరణ, ఎగుమతులపై దృష్టి సారించనున్నారు. ఈ టెక్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో రూ.4,000 కోట్లను కేటాయించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
