AMARAVATHI: అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న రాజధాని అంశంలోని అనిశ్చితికి ముగింపు పలికేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రం తరఫున అవసరమైన పరిపాలనా, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన ప్రభుత్వం, తదుపరి దశగా ఈ అంశాన్ని కేబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన ప్రతిపాదనను తొలుత రాష్ట్ర కేబినెట్లో చర్చించనున్నారు. అక్కడ ఆమోదం లభించిన తర్వాత సంబంధిత ఫైలును కేంద్రానికి, ముఖ్యంగా పార్లమెంట్కు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజధాని అంశానికి చట్టబద్ధ ముద్ర పడాలంటే కేంద్ర స్థాయిలోనూ అవసరమైన అనుమతులు, చట్టపరమైన ప్రక్రియలు పూర్తవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ముందుగానే అన్ని కోణాలను పరిశీలించి, ఎక్కడా న్యాయపరమైన లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది. అమరావతిని చట్టబద్ధ రాజధానిగా ప్రకటిస్తే, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని ప్రశ్నించలేని స్థితి ఏర్పడుతుందన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లపాటు కొనసాగింది. ఈ కాలంలోనే కొత్త రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అప్పట్లో ఈ నిర్ణయానికి అంగీకరించాయి. అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టుతో పాటు పలు కీలక ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 2014 నుంచి 2019 వరకు అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర పాలన కొనసాగింది. పరిపాలనా వ్యవస్థ అక్కడి నుంచే పనిచేసింది. అయితే 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి మారింది. అమరావతిలోనే కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ, మూడు రాజధానుల భావన తెరపైకి రావడంతో రాజధాని అంశం మళ్లీ వివాదాస్పదమైంది.
అమరావతికి చట్టబద్ధత లభిస్తే...
రాజధాని అంశం సున్నితమైనదే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్నది కావడంతో, ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యం చేయకుండా ముందుకు సాగుతోంది. అవసరమైన అన్ని శాఖలతో సంప్రదింపులు పూర్తయ్యాయని, న్యాయపరమైన అంశాలపై కూడా స్పష్టత తీసుకున్నారని సమాచారం. అందుకే కేబినెట్ చర్చకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అమరావతికి చట్టబద్ధత లభిస్తే, అక్కడ ఇప్పటికే ఉన్న మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుంది. అలాగే అభివృద్ధి పనులకు కూడా కొత్త ఊపొస్తుందన్న అంచనాలు ఉన్నాయి. అమరావతిని చట్టబద్ధ రాజధానిగా స్థిరీకరించాలన్న కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. కేబినెట్ ఆమోదం, పార్లమెంట్ ప్రక్రియలు పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇది కేవలం రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు… రాష్ట్ర పరిపాలన, అభివృద్ధి, భవిష్యత్తు స్థిరత్వానికి సంబంధించిన కీలక అడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
