Bhimavaram: అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం..
Bhimavaram: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ఆహ్వానించిన అతిథులకు అవమానం జరిగింది. కేంద్ర పర్యాటక శాఖ.. రాజకీయ పార్టీ ప్రతినిధులకు ఆహ్వానం అందించింది. ఈ నేపథ్యంలో టీడీపీ తరుపున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అల్లూరి విగ్రహావిష్కరణకు హాజరయ్యేందుకు వెళ్లారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడుకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఫోన్ చేసి హెలిప్యాడ్ వద్దకు రావాలని తెలిపారు. ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ డీఐజీ ఇచ్చిన జాబితాలో కూడా అచ్చెన్నాయుడు పేరు ఉంది.
అయితే తమకు వచ్చిన లిస్టులో అచ్చెన్నాయుడు పేరు లేదని కలెక్టర్ అడ్డుకున్నారు. కిషన్రెడ్డి చెప్పినా కలెక్టర్ పట్టించుకోకపోవడంతో కేంద్ర అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితాలో పేరు లేదని కలెక్టర్ చెప్పడంతో బసచేసిన ప్రాంతం వద్దే అచ్చెన్నాయుడు ఆగిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కేంద్రం ఆహ్వానించినా జిల్లా అధికారులు అవమానించడమేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com