Penna River : పెన్నానదికి పోటెత్తిన వరద.. వాహనాల దారి మళ్లింపు
Penna River: నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో.. పెన్నానదికి వరద పోటెత్తింది. దీంతో బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, విడవలూరు మండలాల్లోని పలు గ్రామాలకు నీరు చేరింది. అంతకంతకు పెరుగుతున్న వరద ఉద్ధృతితో... స్థానికులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు.
అధికారులు పడవల సాయంతో... స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అటు మైలవరం డ్యామ్కు భారీ నీటిచేరికతో దిగువన ప్రొద్దుటూరు శివారు అయ్యప్పస్వామి, రెడ్లకల్యాణమండపం, పోట్లదుర్తి గ్రామాలు నీట మునిగాయి. చాపాడు మండలంలోని వెదురు, తిప్పిరెడ్డిపల్లె, రాజుపాలెం గ్రామాలను వరద చుట్టుముట్టింది.
అటు గూడూరు నేషనల్ హైవేపై సుమారు మూడు అడుగులమేర వరద నీటి ప్రవాహంతో.. రాకపోకలకు ఇబ్బంది కల్గుతోంది. హైవేపై కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు..నెల్లురు నుంచి చెన్నైవైపు వెళ్లే వాహనాలను కృష్ణపట్నం వైపు దారిమళ్లిస్తున్నారు. చెన్నై నుంచి నెల్లూరు వచ్చే వాహనాలను కడివేడు మీదుగా కృష్ణపట్నం వైపు మళ్లిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com