ఏలూరు నగరాన్ని తరుముతోన్న తమ్మిలేరు

పశ్చిమగోదావరి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఏలూరు నగరాన్ని తమ్మిలేరు తరుముతోంది. నగరానికి నడి మధ్యన ఉధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు కాల్వకు పలు చోట్ల గండిపడి వీధుల్లోకి, ఇళ్లలోకి నీరు చొచ్చుకొని వస్తోంది. వందలాది ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.. దీంతో ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాకినాడ తీరం దాటగా ఆ ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలకు తోడు ఎగువ నుండి వస్తున్న వరదనీరు ఏలూరు నగరాన్ని వణికిస్తోంది. చింతలపూడి వద్ద నాగిరెడ్డి గూడెం జలాశయానికి గరిష్ట స్థాయిలో నీరు రావడంతో 15 వేల క్యూ సెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న ఏలూరు, పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. తమ్మిలేరు నగరంలో రెండు పాయలుగా వెళ్తుండగా ఒక్కసారిగా వరద ఉధృతంగా పెరగడంతో అనేక చోట్ల గండ్లు పడి ఊరుపై ఏరు విరుచుకుపడుతోంది. తంగేళ్లమూడి, రాణినగర్, బాలయోగి వంతెన, ఆర్.ఆర్.పేట, వైఎస్సార్ కాలనీ, ఎస్.ఎమ్.ఆర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com