RAINS: ఏపీలో భారీ వర్షాలు..ఈ జిల్లాల్లో హై అలర్ట్

ఆంధ్రప్రదేశ్లో నేడు, రేపుభారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈరోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఏపీలో మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనలతో ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులకు అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలకు వెళ్లే వారు అత్యవసరమైతే తప్పా ప్రయాణాలు అంత మంచిది కాదని సూచిస్తున్నారు. మత్స్యకారులు రెండు రోజులపాటు వేటకు వెళ్లకూడదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
అధికారులు అప్రమత్తం
వాతావరణ శాఖ హెచ్చరికలతో భారీ వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేయడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తమై.. ముందస్తు చర్యల్లో భాగంగా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురిసే జిల్లాలో వరద సహాయ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, కడప జిల్లాలకు కోటి చొప్పున అత్యవసర నిధులు విడుదల చేశారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, ఆహారం, హెల్త్ క్యాంపులు, రక్షిత తాగునీరు, శానిటేషన్ కోసం ఈ అత్యవసర నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
కంట్రోల్ రూంల ఏర్పాటు
నెల్లూరు జిల్లాలోని ఇందుకూరిపేట, కోవూరు, కొడవలూరు మండలాల్లో ఎడతెరిపిలేకుండా భారీగా కురుస్తోంది. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే 0861-2331261, 7995576699, 1077 నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. డివిజన్, మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని.. రెవెన్యూ, నీటిపారుదల అధికారులు పెన్నా నది గట్లు పరిశీలించాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com