AP: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం-పూర్తిగా దగ్దమైన బస్సు

ఏపీలో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన మరోసారి రహదారి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. వేగంగా ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా రాజుపాలెం సమీపంలో కావేరి ట్రావెల్స్కు చెందిన బస్సు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఈ బస్సులో దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణ మధ్యలో ఇంజిన్ భాగం నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డుపక్కన నిలిపివేశాడు. ఆ సమయంలో మంటలు మరింత వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. డ్రైవర్, సిబ్బంది అప్రమత్తతతో అందరినీ సురక్షితంగా దింపడంతో ప్రాణనష్టం తప్పింది.
అయితే కొద్ది సేపటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించి వాహనం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఏపీలో ఇప్పటికే చోటుచేసుకున్న రెండు ఘోర బస్సు ప్రమాదాలు ప్రజలను కలవరపరిచాయి. మార్చి 26న మార్కాపురం జిల్లాలో ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి 13 మంది సజీవదహనం అయ్యారు. అలాగే మే 14న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద ప్రైవేట్ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల భద్రతా ప్రమాణాలపై అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
