AP: కీలక మలుపు తిరిగిన చిత్తూరు కాల్పుల కేసు

AP: కీలక మలుపు తిరిగిన చిత్తూరు కాల్పుల కేసు
X
ఓ వ్యాపారి ఇంట్లో చోరీకి మరో వ్యాపారి యత్నం... సినిమా తరహా ఘటనలు

చిత్తూరు జిల్లాలో జరిగిన కాల్పుల ఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఒక ప్రముఖ వ్యాపారి ఇంట్లో మరో ప్రముఖ వ్యాపారి దోపిడీకి పన్నాగం పన్నినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మీ సినిమా హాల్‌ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్‌ వరల్డ్‌ యజమాని చంద్రశేఖర్‌ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడి... రెండు తుపాకులతో కాల్పులు జరిపారు. యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో యజమాని చంద్రశేఖర్‌కు గాయాలయ్యాయి. చంద్రశేఖర్‌ ఇంట్లో దోపిడీకి... ఎస్‌ఎల్‌వీ ఫర్నీచర్‌ యజమాని ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. కర్ణాటక, ఉత్తారాదికి చెందిన దుండగులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. రబ్బర్‌ బుల్లెట్లు వినియోగించే తుపాకులతో ఇంట్లో దోపిడీకి యత్నించారు.

రెండున్నర గంటల ఆపరేషన్

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..రెండున్నర గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించారు. దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేయడానికి వచ్చారా, లేక హత్య చేసే కుట్ర జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఆ నలుగుర్ని పీఎస్ కు తరలించారు.

భారీగా తరలివచ్చిన ప్రజలు

కాల్పులు జరిగాయని తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం గాంధీరోడ్డులోని లక్ష్మి సినిహా హాల్ వద్ద ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. కాసేపు అక్కడ సినిమా సీన్ లాంటి రియల్ సీన్లు కనిపించాయి. పోలీసులు, స్పెషల్ ఫోర్స్ బలగాలు సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. కాల్పులు జరిగిన చుట్టుపక్కల ఇండ్ల వారిని సైతం పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఆయుధాలతో తిరుగుతున్నారని తెలిసినా తమకు సమాచారం అందివ్వాలని చిత్తూరు ఎస్పీ ప్రజలకు సూచించారు.

Tags

Next Story