కరోనా వచ్చిందని భార్యని పుట్టింటికి పంపిన భర్త..
తన భర్త వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఓ నిండు గర్భిణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన విశాఖ సీతమ్మధారలో చోటుచేసుకుంది. నీకు కరోనా వచ్చిందని.. నీతో ఉంటే ప్రమాదమని భర్త వేణుగోపాల్ రెండు నెలల క్రితం పుట్టింటికి పంపేశాడని వాపోయింది. రెండు నెలలైనా తీసుకెళ్లకపోవడంతో అనుమానం వచ్చి అత్తారింటికి వెళ్లగా తన మామ ఇంట్లోకి రానివ్వడం లేదని బాధితురాలు శిరీష తెలిపింది.
పెళ్లైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని వెల్లడించింది శిరీష. పెళ్లప్పుడు 25 లక్షల నగదు, 10 తులాల బంగారం, 3 కేజీల వెండి కట్నంగా ఇచ్చామని.. అయినా వేధింపులు ఆగలేదని చెప్పింది. తన మామ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ కావడంతో పలుకుబడి ఉపయోగించి కొడుకును వెనకేసుకొస్తున్నారని వాపోయింది. న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపింది. వేణుగోపాల్ ఎన్ఐఐటీ డైరెక్టర్ అని చెప్పి మోసం చేశారన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com