YCP: విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తానని వెల్లడించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. నాలుగు దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైసీపీలో టాప్ లీడర్గా ఉన్న విజయసాయి.. సడెన్గా రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
విజయసాయి ప్రకటన యథాతథంగా..
"రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీన రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను." అని విజయసాయి ట్వీట్ చేశారు.
పవన్తో చిరకాల స్నేహం: విజయసాయి రెడ్డి
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, భవిష్యత్లో వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. టీడీపీతో రాజకీయంగా విబేధించినా చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. అలాగే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో చిరకాల స్నేహం ఉందని చెప్పారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకి ధన్యవాదాలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com