Cyclone: ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం

Cyclone:  ఏపీకి ముంచుకొస్తున్న వాయుగుండం
X
ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్, జాగ్రత్త పడాల్సిందే

రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. తర్వాత పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈనెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు (మోడల్స్‌) అంచనా వేస్తున్నాయి. తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడ్డాక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండం : అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. కర్ణాటక, గోవా రాష్ట్రాల తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ 2 లేదా 3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

Tags

Next Story