విశాఖలో దారుణం.. కులాంతర వివాహం చేసుకున్నందుకు..

కులాంతర వివాహం చేసుకోవడమే నేరమైంది. ఈ పెళ్లిని జీర్ణించుకోలేని అగ్ర వర్ణాలు.. దళిత కుటుంబంపై కక్ష కట్టాయి. అమ్మాయి తరపు వారు దళితులు కావడంతో సామాజిక బహిష్కరణ విధించడం వివాదానికి తెరలేపింది. బెదిరింపులు తాళలేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటికి వచ్చింది. ఈ అమానవీయ ఘటన విశాఖ జిల్లా రావికమతం మండలంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
గుమ్మళ్లపూడి గ్రామానికి చెందిన ఓ అగ్ర కులానికి చెందిన యువకుడు.. దళిత కుటుంబానికి చెందిన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో అగ్రవర్ణాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.యువతి కుటుంబంతో పాటు మిగతా దళిత కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు అగ్ర వర్ణాలు ప్రకటించాయి. ఆ కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వకుండా ఆదేశించారు. బహిష్కరణకు గురైన వారికి సహకరిస్తే జరిమానా విధిస్తామని గ్రామ పెద్దలు ఇతరులను హెచ్చరించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com