Shankhabrata Bagchi: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ
ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీబాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఆయన ఆ పదవిలోకొనసాగనున్నారు. కాగా, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ ఆదివారం వేటువేసిన విషయం తెలిసిందే. తక్షణమే ఆయనను బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీచేసింది. సోమవారం ఉదయం11 గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. వారిలో నుంచి ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అయిన బాగ్జీ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
కాగా, నూతన డీజీపీ ఎంపిక జాబితాలో సీహెచ్ తిరుమల రావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్లు ఉన్నారు. తిరుమల రావు, అంజనా సిన్హా 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు కాగా, మాదిరెద్ది ప్రతాప్ 1991వ బ్యాచ్కు చెందినవారు. తిరుమల రావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉండగా, అంజనా సిన్హా రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికో ఒక్కరికి ఏపీ డీజీపీగా నియమించే అవకాశం ఉంది.
ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారనే విమర్శలు ఉన్నాయి. అంతా గమనించేలా ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా ఏ రోజూ పట్టించుకోలేదని ఆయా పార్టీల నేతల ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఆయన అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనకు పిలుపునిచ్చినా అణగదొక్కడంపై విమర్శలున్నాయి. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాతే ఆయన ప్రతిపక్షాలకు అపాయింట్ మెంట్ ఇస్తున్నారనే ప్రచారం సాగింది. ఆయన డీజీపీగా ఉంటే ఎన్నికలు పారదర్శకంగా జరగవని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఫిర్యాదులతో విచారణ చేసిన ఈసీ.. డీజీపీపై బదిలీ వేటు వేసింది. సార్వత్రిక ఎన్నికల పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించొద్దని ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com