ఏపీలో నిత్యం కల్లోల పరిస్థితులే

విదేశాల్లో ఎన్ఆర్ఐలు ప్రశాంతంగా ఉంటే.. ఏపీలో మాత్రం నిత్యం కల్లోల పరిస్థితులే ఉన్నాయన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇతర దేశాల్లో అమలైనట్టుగా ఏపీలో లా అండ్ ఆర్డర్ సవ్యంగా లేదన్నారు.. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ను గల్ఫ్ ప్రతినిధులు కలిశారు.. జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితులు చర్చకు వచ్చాయి.
ఏపీలో కొనసాగుతున్న దౌర్జన్యాలు, రౌడీయిజాన్ని గల్ఫ్ ప్రతినిధులకు వివరించారు పవన్ కళ్యాణ్.. ఎక్కడో దూరాన ఉన్న గల్ఫ్ దేశాలకు ఎంతోమంది వెళ్లి ప్రశాంతంగా జీవిస్తున్నారు కానీ.. ఏపీలో అలాంటి పరిస్థితులు లేవన్నారు. అన్యాయం జరిగితే చెప్పుకోవడానికి తెలిసిన పోలీస్ అధికారైనా ఉండాలి.. లేదంటే సొంత కులానికి చెందిన ఎమ్మెల్యే అయినా ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో దేశాధినేతలు కూడా సాధారణ జీవితం గడిపితే.. ఏపీలో మాత్రం కౌన్సిలర్ కూడా ప్రజలను బెదిరిస్తున్నాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న రూల్ ఆఫ్ లా ఏపీలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్.
జనసేన కార్యకర్తలపై అక్రమంగా నమోదు చేస్తున్న కేసులను లీగల్గానే ఎదుర్కొంటామన్నారు పవన్ కళ్యాణ్.. అవినీతి రహిత రాజకీయాలే జనసేన లక్ష్యమని.. గల్ఫ్ ప్రతినిధులు ఇచ్చిన మద్దతుతో మరింత బాధ్యతతో పనిచేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com