Kakinada News : వాడిపోతున్న వరి పైరు

ఖరీఫ్లో కలసిరాలేదు... కనీసం రబీలోనైనా అనుకున్న దిగుబడి సాధించి కొంతమేర అప్పుల భారం తగ్గించుకోవచ్చనుకున్న వరి రైతులకు నిరాశే మిగులుతోంది. మండుతున్న ఎండలకు తోడు... సకాలంలో సాగునీరందక పొట్టదశలో వరిపైరు వాడిపోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండంలోని గోదావరి డెల్టా శివారు గ్రామాల్లో సాగునీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయని కర్షకులు వాపోతున్నారు.
చూశారుగా ఇది కాకినాడ జిల్లాలోని గోదావరి డెల్టా శివారు మండలమైన తాళ్లరేవులో పంట పొలాల పరిస్థితి. సాగునీరు అందక పొలం బీటలు వారి ద్విచక్ర వాహనాలు సైతం తిరిగేందుకు అనువుగా తయారైంది. మండలంలోని గ్రాంటు గ్రామ ఆయకట్టు పరిధిలో ఇప్పటి వరకు తీవ్రంగా వేధించిన నీటి కొరత తాజాగా పోలేకూరు, మల్లవరం, గాడిమొగ, కోరంగి, తాళ్లరేవు తదితర గ్రామాలకూ విస్తరించింది. ఆయా గ్రామాల్లోని సుమారు 1500 ఎకరాల్లో నీరు అందక పొలాలు బీటలు వారుతున్నాయి. రబీలో వరి పంటకు వారాబందీ విధానంతో నీటిని అందిస్తున్నారు. రోజుల తరబడి నీరు అందకపోవడంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోతోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి పంట పొట్ట దశలో ఉందని తప్పనిసరిగా తడులు అందిచాల్సిన తరుణంలో సాగునీటి సంక్షోభం తలెత్తిందని రైతులు వాపోతున్నారు. పంటకు మోటార్ల ద్వారా తడులు ఇచ్చేందుకు కాల్వల్లోనూ నీరు లేదని... ఏం చేయాలో పాలుపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com