మావోయిస్టు అగ్రనేత లొంగుబాటుకు లైన్క్లియర్

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముపాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి పోలీసుల నుంచి లైన్క్లియర్ అయ్యింది. 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఉద్యమం నుంచి బయటకు రావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసు శాఖ గణపతి సహా ఎవరు లొంగిపోయినా స్వాగతిస్తామని ప్రకటించారు. గణపతి లొంగిపోవాలి అనుకుంటే కుటుంబసభ్యుల, బంధువులతో సంప్రదించవచ్చని తెలిపారు. దీంతో రానున్న రెండురోజుల్లో గణపతి లొంగిపోయే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు, ఆయన అంగరక్షకులు కూడా లొంగిపోనున్నారు
జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామానికి చెందిన గణపతి 40 ఏళ్ల పాటు విప్లయోధ్యమంలో కీలక పదవులు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో 2018 లో కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అయితే లొంగుబాటుపై ఆయన తీసుకునే అనూహ్య నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. సారూప్య భావజాలమున్న పార్టీల కలయికగా 2004లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ...మావోయిస్టుకు తొలి నుంచీ గణపతే కేంద్ర కార్యదర్శిగా వ్యవహరించారు. 14 ఏళ్ల సుదీర్ఘ బాధ్యతల నుంచి 2018లో తప్పుకున్నారు. 74 ఏళ్ల గణపతి ప్రస్తుతం ఉబ్బసం, మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని, సరిగా నడవలేని స్థితిలో ఉన్నారని, అందుకే లొంగిపోయి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. మావోయిస్టు నాయకుడైన గణపతి తలపై కోటిన్నర రివార్డు ఉంది. గణపతి లొంగిపోతే విప్లవోద్యమాలకు పెద్ద కుదుపుగానే భావించవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com