యలమంచిలిలో లిక్కర్ మాఫియా దందా ..

విశాఖ జిల్లా యలమంచిలిలో లిక్కర్ మాఫియా దందా యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి 9గంటల వరకు తెరిచి ఉంచాల్సిన ప్రభుత్వ వైన్షాపుల్ని ఎనిమిది గంటలకే మూసివేస్తున్నారు. తద్వారా ప్రైవేటు బార్ల అమ్మకాలు పెంచేందుకు దారులు వేస్తున్నారు. యలమంచిలిలోని నాలుగు వైన్ షాపుల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. ఇగ పట్టణంలోని సింహాద్రి బార్ అండ్ రెస్టారెంట్ అయితే 24గంటల పాటు అమ్మకాలు సాగిస్తోంది.
100 రూపాయల మద్యం 130 రూపాయలకు, 200రూపాయల మద్యం 260రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ వైన్ షాపుల్లో పని చేసే సిబ్బందిని మేనేజ్ చేస్తున్న సిండికేట్ వ్యాపారులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ సిండికేట్ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని స్థానిక జనసేన నాయకుడు విజయ్ కుమార్ చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com