Maha Shivaratri: ఎటు చూసినా శివోహమే
![Maha Shivaratri: ఎటు చూసినా శివోహమే Maha Shivaratri: ఎటు చూసినా శివోహమే](https://www.tv5news.in/h-upload/2023/02/18/902454-srisailam-celebrations.webp)
మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలం భ్రమరాంబిక-మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భక్తుల దర్శనం కోసం ఆలయ పరిసరాల్లో నాలుగు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అయితే శ్రీశైల క్షేత్రంలో గందరగోళం నెలకొంది. మల్లన్న దర్శనం కోసం లక్షల్లో భక్తులు తరలివస్తున్నారు. అయితే దేవస్ధాన అధికారులు, పోలీసులకు మధ్య సమన్వయలోపం భక్తులకు శాపంగా మారింది. ఇష్టానుసారంగా వీఐపీ పాసులు జారీ చేయడంతో భక్తలను పోలీసులు కంట్రోల్ చేయలేక పోతున్నారు. వీఐపీ క్యూ లైన్ పొడిగించడంతో రద్దీ పెరిగి సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు ఉపవాసాలు ఉండటంతో, ఎక్కువ సేపు క్యూలైన్లలో నిల్చోలేక కొందరు భక్తులు సొమ్మసిల్లి పడిపోతున్నారు.
మరో వైపు సున్నిపెంటలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ నుంచి భారీగా శ్రీశైలంకు భక్తులు తరలివస్తుండటంలో శ్రీశైలం కొండ ప్రాంతం నిండిపోయింది. దీంతో కొండ పైకి వెళ్లడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వాహనాలు ఆపేయడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు భక్తులు, మరి కొందరు శివ స్వాములు ధర్నాకు దిగారు. అయితే ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదని ఆర్టీసీ బస్సు లేదా నడకమార్గంలో శ్రీశైలం వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com