DSC: మెగా డీఎస్సీ ఎప్పుడో..?

DSC: మెగా డీఎస్సీ ఎప్పుడో..?
X
వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభ్యర్థులు... ఎస్సీ వర్గీకరణ నివేదిక తర్వాతే అన్న వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ కోసం అభ్యర్థులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసి, భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్‌ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ తన నివేదిక సమర్పించిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు కదలనుందని తెలుస్తోంది. మరోవైపు పూర్తిస్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుపుతామని, కొరత అనే మాట లేకుండా చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొత్తం 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే పెట్టారు. ఆ వెంటనే జూలై 1న డీఎస్సీ ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. కానీ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే చాలావరకు ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా, ఇంతవరకూ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఏటా వేసవి సెలవుల అనంతరం జూన్‌ 12న బడులు తెరుచుకుంటాయి. ఈ ఐదు నెలల్లోపే కొత్త టీచర్ల ఎంపిక, వారికి శిక్షణ పూర్తిచేయడం సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది.

వాయిదాల పర్వం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20రోజుల వ్యవధిలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అయితే సన్నద్ధతకు కొంత గడువు ఇవ్వాలని అభ్యర్థులు కోరడంతో 3నెలలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అక్టోబరు 6న డీఎస్సీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది. ఈలోగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ పూర్తిచేసింది. ఇంతలో ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో నోటిఫికేషన్‌కు మరోసారి బ్రేక్‌ పడింది. వర్గీకరణ సిఫారసుల కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం... మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కమిషన్‌ కొద్దిరోజుల కిందటే క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించడంతో నివేదికకు కనీసం మరో 2నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తే బడులు తెరిచే నాటికి భర్తీ ప్రక్రియ పూర్తికావడం సాధ్యం కాదు. గతంలో ఎప్పుడూ ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి సజావుగా పూర్తికాలేదు. అందులోనూ ఇప్పుడు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ కావడంతో మరింత సమయం అవసరమని అధికారులు చెప్తున్నారు.

ఎదురుచూపులు

సీఎం తొలి సంతకం పెట్టినప్పటినుంచీ బీఈడీ చదివిన నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ లేకపోవడంతో ఆశావహుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందోనని వారంతా ఆత్రుతగా ఉన్నారు.

Tags

Next Story