AP:దేశంలోనే మొదటిసారి "మెగా పేరెంట్-టీచర్ మీట్"

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది. ఏపీ వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్ టీచర్ మీట్ జరగనుంది. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు. 38,319 మండలపరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు.. 2,807 మునిసిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్, 2843 ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకూ సమావేశం నిర్వహించనున్నారు. కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. బాపట్ల మున్సిపల్ పాఠశాలలో నిర్వహించే పీటీఎంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో వారు చర్చించనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కడప మున్సిపల్ స్కూల్లో జరిగే పేరెంట్ మీటింగ్కు హాజరుకానున్నారు.
దేశంలోనే మొదటిసారి
దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నారు. అందరు తల్లిదండ్రులలో ఒకరి అధ్యక్షతన పూర్తి కార్యక్రమం జరగనుంది. విద్యార్థుల తలిదండ్రులకు విద్యార్థులే తయారు చేసిన ఆహ్వాన పత్రికలు పంపారు. ప్రతీ స్కూలులో పూర్వ విద్యార్థులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. తండ్రులకు టగ్ ఆఫ్ వార్, తల్లులకు రంగోలీ పోటీలు నిర్వహించనున్నారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని వెల్లడించారు. తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, సంబంధిత పాఠశాలల్లో చదివిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, దాతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోన శశిధర్ కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చాలనే లక్ష్యంతో ప్రతి పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతీ ఎమ్మెల్యే, ప్రతీ మంత్రి వారి నియోజకవర్గాల్లో పాల్గొనాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
రేటింగ్ విధానం
0-5 స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతి పాఠశాలలో అమలు పరుస్తామని శశిధర్ వివరించారు. ప్రతి పాఠశాలకు తొలుత ప్రకటించిన స్టార్ రేటింగ్ క్రమంగా ఏడాదికి ఏడాది వృద్ధి అయ్యేలా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు - విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ గరిష్టంగా 5 స్టార్ రేటింగ్లోకి అన్ని ప్రభుత్వ పాఠశాలలను తీసుకువెళ్లేందుకు చర్యలు చేపడతామని శాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com