తీవ్ర దుమారం రేపిన మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు

అమరావతి రాజధాని తరలింపుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మూడు ముక్కల రాజధాని అని ప్రభుత్వం చెప్పే మాటలు అన్నీ ఒక బూటకం అని విమర్శించారు అమరావతి జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్. మూడు ముక్కల రాజధాని పేరుతో అన్ని శాఖలు విశాఖకు తరలించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అందరూ కలిసి కుట్రలు పన్ని అమరావతిని ధ్వంసం చేస్తున్నారని అన్నారు. శాసన రాజధాని ఇక్కడ ఉండదని రైతులను బెదిరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూడు రాజధానుల ప్రకటన, కొడాలి నాని వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పువ్వాడ సుధాకర్ డిమాండ్ చేశారు.
ఇక ఈ ప్రభుత్వం హైకోర్టును కర్నూలుకు తీసుకెళ్లలేదని, చివరికి దాన్ని కూడా విశాఖకు తరలిస్తాం అంటారని దళిత జేఏసీ నేత మార్టిన్ అన్నారు. దళితులు మా మేనమామలు అని చెప్పిన సీఎం... ఇప్పుడు వాళ్ల గొంతు కోస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, సీఎం జగన్... మంత్రుల నోరు మూయించాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి జోలికొస్తే దళితులు చూస్తూ ఊరుకోరని మార్టిన్ హెచ్చరించారు. ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది దళితులే... ఈ ప్రభుత్వాన్ని దించేది కూడా దళితులేనని ఆయన అన్నారు. అమరావతిని నాశనం చేస్తే నష్టపోయేది దళితులేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళిత జాతిని నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మార్టిన్ మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com