AP budget: బడ్జెట్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో 2024-25 వార్షిక బడ్జెట్కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. మంత్రులు నారా లోకేశ్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళి అర్పించారు. రాజధాని రైతులను మంత్రి నారా లోకేశ్ ఆప్యాయంగా పలకరించారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారంటూ అభినందించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దిశగా బడ్జెట్ ఉంటుందని తెదేపా నేతలు తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా చెమటోడుస్తోంది. ఆర్థికంగా కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికమంత్రిగా పయ్యావుల బాధ్యతలు స్వీకరించారు. బడ్జెట్పై తీవ్ర కసరత్తు చేసిన ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రంగాలకు సమప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ను రూపొందించినట్టు తెలిసింది. అమల్లోకి వచ్చిన సూపర్ సిక్స్ హామీలకు, పెన్షన్లు, దీపం 2.0, అన్న క్యాంటీన్ల పథకాలకు నిధులు కేటాయించినట్టు సమాచారం. అలాగే, నీటిపారుదల, రోడ్ల మరమ్మతులు, నిర్మాణ రంగానికి నిధుల కేటాయింపుపై బడ్జెట్లో పెద్ద పీట వేసినట్టు తెలిసింది.
అలాగే, పోలవరం, రాజధాని పనుల పునఃప్రారంభానికి నిధుల లేమి లేకుండా బడ్జెట్లో ఏర్పాట్లు చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను అనుసంధానించి బడ్జెట్కు రూపకల్పన చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలకు నిధుల కల్పన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కేటాయింపు, ‘నరేగా’ కింద చేపట్టాల్సిన పనులపై ఆర్థికమంత్రి పయ్యావుల ప్రత్యేక దృష్టిసారించారు. ప్రభుత్వం తెచ్చిన వివిధ పాలసీలకు అనుగుణంగా అవసరమైన మేరకు నిధుల సర్దుబాటుపై కసరత్తు చేశారు. వీటితోపాటు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్య శ్రీ నిధుల చెల్లింపులపైనా మంత్రి ఫోకస్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com