Minister Roja: మంత్రి రోజా ప్రవర్తనపై భక్తుల అసహనం..

Minister Roja: మంత్రి రోజా లేపాక్షి పర్యటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు గంటలుగా క్యూలైన్లోనే నిల్చొబెట్టి.. మంత్రి రోజా మాత్రం లేపాక్షి ఆలయంలో ఫొటోలకు పోజులు ఇచ్చారంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా తనతో పాటు భక్తులెవరినీ రానివ్వొద్దని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి మరీ.. అధికారులతో ఆలయ ద్వారం మూసివేయించారని మండిపడ్డారు.
ఒకానొక దశలో మంత్రి రోజానే పోలీసులపై అసహనం వ్యక్తం చేశారని భక్తులు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా లేపాక్షి ఆలయంలో ఫొటోలు దిగాలని, అందరూ తప్పుకోవాలని మంత్రి రోజా తమపై విరుచుకుపడ్డారని అక్కడున్న భక్తులు వాపోయారు. చివరికి వైసీపీ నాయకులను సైతం తన వెంట రానివ్వలేదని చెప్పుకొచ్చారు.
నిజానికి లేపాక్షి ఆలయంలో గ్రహణ సమయాల్లో తప్ప.. మధ్యలో ఆలయ ద్వారాన్ని మూయకూడదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ద్వారం తెరిచే ఉంచాలి. అలాంటిది సంప్రదాయానికి భిన్నంగా మంత్రి రోజా వ్యవహరించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలవిరాట్ దర్శనానికి సాయంత్రం మూడు నుంచి ఐదు గంటల వరకు భక్తులను అనుమతించకపోవడంపై మండిపడ్డారు.
మంత్రి రోజాకు ఇంత అధికారదర్పం ఏంటంటూ బహిరంగంగానే ఆగ్రహం వెళ్లగక్కారు భక్తులు. ఓవైపు భక్తులను రెండు గంటల పాటు క్యూలైన్లో వేచి ఉండేలా చేసి.. మంత్రి రోజా మాత్రం ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉండిపోయారని మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com