Nara Lokesh : పదోరోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర

నారా లోకేష్ యువగళం పాదయాత్ర పదో రోజు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం తవణంపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మారెడుపల్లి, కురపల్లె, కాణిపాకం, పైపల్లె, తెల్లగుండ్ల మీదుగా మంగసముద్రం వరకు పాదయాత్ర సాగనుంది. తవణంపల్లి క్యాంప్ సైట్లో గాండ్ల సామాజిక వర్గీయలుతో లోకేష్ సమావేశయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో తమకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదని లోకేష్కు చెప్పారు. తమకు కమ్యూనిటీ హాలు లేదని, తమ కులస్తులు ఆయిల్ మిల్లులు పెట్టుకోవడానికి సబ్సీడీలు ఇవ్వాలని కోరారు. మహిళలకు కార్పొరేషన్ ద్వారా కుట్టుమిషన్లు అందించే ఏర్పాటు చేయాలన్నారు.
స్పందించిన లోకేష్... గాండ్ల కులస్తులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. గతంలోనే టీడీపీ గాండ్ల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుందని ఆయన గుర్తు చేశారు. కష్టజీవువలైన గాండ్ల కులస్తుల సమస్యలను జగన్ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు లోకేష్ను కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రతినిధులు కలిసి తమ సమస్యల్ని చెప్పుకున్నారు. కమ్యూనిటీ పారమెడికల్స్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు పారామెడికల్స్ ప్రతినిధులు. దీనిపై స్పందించిన లోకేష్ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్యూనిటి పారామెడికల్స్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
మరోవైపు మారెడుపల్లిగ్రామంలో లోకేష్కు భారీ స్వాగతం పలికారు గ్రామస్థులు. గజమాలతో లోకేష్కు ఘనస్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. పాదయాత్ర వంద కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో వంద కిలోల భారీ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇవాళ పది కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఓ వైపు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. అన్ని వర్గాలతో లోకేష్ మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా యువత నుంచి పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్పై నిప్పులు చెరుగుతున్నారు. బడుగు, బలహీన వర్గాలను జగన్ సర్కార్ మోసం చేస్తుందని లోకేష్ అంటున్నారు. తమ ప్రభుత్వం వస్తే వారి సమస్యలను తీరుస్తామని హామీ ఇస్తున్నారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు మొత్తం 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com