LOKESH: ప్రభుత్వ పాఠశాలలో నారా లోకేశ్ ఆకస్మిక తనిఖీ

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తారక రామానగర్ మండల పరిషత్ ఆదర్శ పాఠశాలను మంత్రి నారా లోకేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఈ పాఠశాలలో భోజనం సరిగా లేదంటూ విద్యార్థులతో డ్రామా ఆడించి, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన హెచ్ఎం జాన్ను ప్రభుత్వం సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో, పాఠశాలకు చేరుకున్న లోకేష్.. క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి అసలు విషయాలను తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా, మీడియాను లోపలికి అనుమతించకుండా అత్యంత గోప్యంగా ఈ తనిఖీ నిర్వహించారు. కుట్రపూరిత ప్రచారాలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని లోకేష్ తెలిపారు.
మా లక్ష్యం అదే
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఏపీఈడీబీని మళ్ళీ గాడిలో పెడుతున్నామన్నారు. కేవలం 20 నెలల్లోనే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి రావడం గర్వకారణమని, గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని తెలిపారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, పరిశ్రమల స్థాపనే ప్రధాన ఎజెండాగా పని చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
