పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో మరింత కోతకు కేంద్రం నిర్ణయం?

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో మరింత కోతకు కేంద్రం నిర్ణయం?

పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో ఇప్పటికే పెద్ద కొర్రీ పడిందని ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు మరింత కోత పెట్టే నిర్ణయం ఒకటి తెరపైకి వచ్చింది. పోలవరం ప్రాజెక్టులో తాజా లెక్కల ప్రకారం తాగునీటి విభాగానికి, విద్యుత్కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది కేంద్రం. ఆ మేరకు కోత పెట్టి 1.4.2014 నాటికి ఉన్న ధరల ప్రకారం అంచనాలు లెక్కించి ఆ మొత్తమే ఇస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ ఇప్పటికే తాగునీటి పనులకు, విద్యుత్కేంద్రం పనులకు నిధులు ఇచ్చి ఉంటే ఇకపై చెల్లించబోయే బిల్లుల నుంచి ఆ మొత్తాలను మినహాయించాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారి అనూప్‌ శ్రీవాత్సవ తాజాగా ఒక లేఖ పంపినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ వర్గాలు ఈ విషయాలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన బిల్లులను కేంద్రం తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి 2 వేల 234 కోట్ల చెల్లింపుపై అన్ని స్థాయిల్లోనూ తనిఖీ పూర్తయి కేంద్ర ఆర్థికశాఖకు చేరింది. ఆ నిధులు చెల్లించే క్రమంలో ఆర్థికశాఖ విధించిన షరతులు ఇప్పటికే సంచలనం సృష్టించాయి. పోలవరం ప్రాజెక్టుకు 1.4.2014 నాటి ధరలు, క్వాంటిటీల ప్రకారం 20 వేల 398 కోట్లకు డీపీఆర్‌-2 ఖరారు చేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది.

2017 మార్చి నాటి కేంద్ర మంత్రిమండలి నోట్‌ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమోదించి పంపాలని పోలవరం అథారిటీకి సూచించింది. కేంద్ర ఆర్థికశాఖ లెక్క ప్రకారం ఇక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవ్వాల్సింది కేవలం 7వేల 053 కోట్లు మాత్రమే. ఇప్పుడు తాజాగా కేంద్ర జలశక్తి శాఖ రాసిన లేఖ ప్రకారం ఆ మొత్తమూ వచ్చే అవకాశం లేదా అన్న పరిస్థితి ఏర్పడింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు ఆడిట్‌ లెక్కల ప్రకారం అయిన ఖర్చు 4 వేల 730 కోట్లు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి ముందు ఖర్చుపెట్టిన నిధులు ఇవ్వబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో ఆ తర్వాత ఇంతవరకు రాష్ట్రానికి చెల్లించిన మొత్తం 8 వేల 614 కోట్లుగా ఉంది. ఆ నిధులను ఏయే విభాగాల కింద చెల్లించారో పోలవరం అథారిటీ ఇప్పుడు మళ్లీ పరిశీలించాలి. అందులో ఒకవేళ తాగునీటి విభాగం పనులకు, విద్యుత్కేంద్రం పనులకు సంబంధించిన బిల్లులు ఏమైనా ఉన్నాయోమో చూడాలి. ఆ విభాగం కింద ఏవైనా చెల్లింపులు జరిగాయని గుర్తిస్తే.. అలా చెల్లించిన మొత్తాన్ని ఇకపై కేంద్రం ఇచ్చే బిల్లుల్లో మినహాయించుకోవాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story