POSANI: "లవ్ యూ రాజా" పోసాని సమాధానమిదే..!

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ ముగిసింది. ఓబులవారిపల్లె పీఎస్లో ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు దాదాపు 9 గంటల పాటు ఆయనను విచారించారు. అనంతరం పోసానిని కోర్టులో హాజరుపర్చారు. కాగా.. విచారణకు పోసాని సహకరించలేదని తెలుస్తోంది. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తులేదు, అవునా? అంటూ పోసాని సమాధానాలు దాటవేస్తున్నారు. వీడియోలు ముందు పెట్టి ప్రశ్నించినా.. ‘లవ్ యు రాజా’ అంటూ తనదైన శైలిలో పోసాని ప్రవర్తిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
పోసాని విచారణకు సహకరించట్లేదు: పోలీసులు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి విచారణకు సహకరించట్లేదని పోలీసులు అంటున్నారు. ఆయన సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారని, నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుందన్నారు. కాగా.. పోలీసులు పీఎస్కు రైల్వే కోడూరు కోర్టు పీపీని, ప్రభుత్వ తరఫు లాయర్ను పిలిపించారు.
స్పందించిన మంత్రి సత్యకుమార్
వైసీపీ మద్దతుదారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టుపై మంత్రి సత్యకుమార్ స్పందించారు. ‘చంద్రబాబు, లోకేశ్పై ఆయన అసభ్యంగా మాట్లాడారు. అందుకే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రభుత్వం కేవలం బాధితుల పక్షాన నిలబడుతోంది. బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’ అని అన్నారు.
అరెస్ట్ను ఖండించిన జగన్
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఖండించారు. పోసాని భార్య కుసుమలతను పోన్లో జగన్ పరామర్శించారు. పోసాని కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 'మీరు ధైర్యంగా ఉండండి. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు.' అంటూ జగన్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com