POSANI: చేయించింది.. చెప్పించింది "సాక్షి"నే: పోసాని

సీఐడీ విచారణలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన విషయాలు వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్పై తనతో మాట్లాడించింది సాక్షి మీడియా వాళ్లే అని పోసాని చెప్పినట్లు తెలుస్తోంది. అనుచిత వ్యాఖ్యల కేసులో తన పాత్ర లేదని పోసాని సీఐడీ విచారణలో చెప్పినట్టు తెలిసింది. సాక్షి పత్రికవారే ప్రెస్మీట్లు ఏర్పాటు చేసేవారని, ఏం మాట్లాడాలో సబ్జెక్టు వారే చెప్పేవారని పోసాని విచారణలో తెలిపారని సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు విచారించారు. డీఎస్పీ లక్ష్మయ్య తదితరులు 32 ప్రశ్నలు అడగ్గా కొన్నింటికి స్పష్టమైన సమాధానాలిచ్చిన పోసాని.. మరికొన్ని ప్రశ్నలకు తెలియదని, గుర్తు లేదని మొక్కుబడిగా స్పందించారని సమాచారం.
మరోసారి విచారణ...!
పోసాని కృష్ణమురళి ఒకరోజు సీఐడీ విచారణ ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈరోజు పోసానిని ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. కోర్టు పోసానిని ఒక రోజు సీఐడీ కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణ ముగియడంతో ఆయనకు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జైలుకు తరలించారు. దాదాపు నాలుగు గంటల సేపు విచారణ కొనసాగింది. పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. దీనికోసం మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది.
పోసానితో ఫొటోలకు తహతహ
సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళితో ఫొటోలు దిగేందుకు గుంటూరు సీఐడీ పోలీసులు తహతహలాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోసాని జైలులోకి వెళ్లే సమయంలో ఆయనతో పాటు వచ్చిన సీఐడీ పోలీసులు ప్రధాన గేటు వద్ద నిలబడి ఫొటోలు తీసుకున్నారు. ఒక రిమాండ్ ఖైదీ విషయంలో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా అంటూ విమర్శలొస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com