Ongole: పోలీసుల దాష్టీకంతో దళిత యువకుడి ఆత్మహత్యా యత్నం

Ongole:  పోలీసుల దాష్టీకంతో దళిత యువకుడి ఆత్మహత్యా యత్నం
కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స

రాష్ట్రంలో ఖాకీల దాష్టికానికి మరో దళితుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సంబంధం లేని కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ.. స్టేషన్‌లోనే దళిత యువకుడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 50శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

సంబంధంలేని కేసులో తనను, తన తండ్రిని ఠాణాకు పిలిచి పోలీసులు వేధించడంతో మోజెస్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ వద్దే పెట్రోలు పోసుకొని నిప్పంటించుకోవడం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కలకలం రేపింది. యర్రగొండపాలెంలోని గాయత్రి థియేటర్‌ సమీపంలో నాగెపోగు నరసింహారావు కుటుంబం నివాసం ఉంటోంది. వారి కుమారుడు 19ఏళ్ల మోజేష్ దూరవిద్యలో డిగ్రీ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం మాచర్ల రోడ్డులోని రాళ్లవాగు వంతెన పక్కన కొందరు యువకులు గొడవపడ్డారు. పోలీసులు వెళ్లి,ఆ సమయంలో అక్కడున్న మోజేష్, సుభాని అనే యువకులను స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారు. మోజేష్ తండ్రిని పిలిచి ఇష్టమొచ్చినట్లు దూషించారు. అదేరోజు రాత్రి వారిని ఇంటికి పంపించిన పోలీసులు బుధవారం మళ్లీ రమ్మని చెప్పారు. బుధవారం ఉదయం సైతం కొట్టి, తన తండ్రిని ఎస్సై, సీఐ ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడటంతో మోజేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. స్టేషన్ ఆవరణలోనే బుధవారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు అంటుకోవడంతో కేకలు వేస్తూ స్టేషన్ నుంచి బయటకొచ్చి ఎదురు వీధిలోని నీళ్ల డ్రమ్ములో పడ్డాడు. ఎస్సై రాజేష్, సిబ్బంది హుటాహుటిన అతణ్ని మార్కా పురం వైద్యశాలకు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి స్థానిక సీఐ, ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు కారణమని మోజెస్ తెలిపాడు.

మోజేష్ శరీరం దాదాపు 50 శాతం కాలిపోయినట్లు మార్కాపురం ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. అక్కడ్నుంచి మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మెడికో లీగల్ కేసు కట్టకుండా వైద్యం చేయలేమని వారు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులతో రాజీకి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అకారణంగా తమ బిడ్డను పోలీసులు కొట్టడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీసు స్టేషన్ ముందు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

దళితులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని యర్రగొండపాలెం తెలుగుదేశం ఇంఛార్జ్ ఎరిక్సన్ బాబు డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story