మూడు రాజధానులకు వ్యతిరేకంగా హోరెత్తుతున్న నిరసనలు

రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళనలు 257వ రోజుకు చేరాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా హోరెత్తుతున్న నిరసనలు రోజుకో వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజధాని గ్రామాల్లో తమ గళం వినిపిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రకటించే వరకు ఎందాకైనా పోరాడతామని తేల్చిచెబుతున్నారు.
ఐదు కోట్ల ఆంధ్రుల కోసం పచ్చని పంట పొలాల్ని త్యాగం చేసిన తమను.. వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. కేసుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నా.. రాజధాని సాధించుకునే వరకు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. అమరావతి తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. రైతులతో కన్నీరు పెట్టించడం మంచిది కాదంటున్నారు. ప్రభుత్వం అనాలోచితంగా రాజధాని తరలింపు నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు.
రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా ఏపీలోని పలు జిల్లాల్లో విపక్షాలు తమ నిరసనలు తెలుపుతున్నాయి. అమరావతే రాజధాని అంటూ నమ్మించి.. జగన్ మోసం చేశారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపి.. ఇప్పుడు మూడు రాజధానులు పెడతామని మాట్లాడడం సరికాదన్నారు. పాలకులు మోసం చేస్తున్నా... న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com