Nagari: నగరిలో రోజా వికసిస్తుందా..

Nagari: నగరిలో రోజా వికసిస్తుందా..
X
ఈసారి గెలుపు కష్టమనేలా మారిన పరిస్థితులు

గడచిన రెండు ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన రీతిలో నగరి నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి రోజా.... ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రోజా అవినీతి, పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేక నేతలు తెదేపాలో చేరుతున్నారు. ఇక పార్టీలో ఉన్నవారి నుంచి కూడా సహకారం కరవైంది. ఫలితంగా హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కల కల్లలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన నగరి నియోజకవర్గం పోరు ప్రతి ఎన్నికల్లోనూ రసవత్తరమే. ఇక్కడ గెలుపు ఓటములు దోబూచులాడుతూ...చివరి రౌండు లెక్కింపు వరకు అభ్యర్థులను ఒత్తిడికి గురిచేస్తాయి. కానీ ప్రస్తుత ఎన్నికల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వైకాపా నుంచి రెండుసార్లు గెలిచిన మంత్రి రోజా మూడోసారి బరిలో నిలిస్తే... తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌ పోటీలో ఉన్నారు. పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంటే.... వైకాపా కార్యకర్తలను నిస్తేజం ఆవరించింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు వ్యక్తిగతంగా రోజా మూటగట్టుకున్న అవినీతి ఆరోపణలు ఆమెను చుట్టుముట్టాయి. రోజూ పెరిగిపోతున్న వ్యతిరేక పవనాలను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి.

నగరి నియోజకవర్గంలో 2లక్షల 1607 ఓట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి రోజా.... తెలుగుదేశం నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు పోటీ పడ్డారు. ఆ ఎన్నికల్లో 858 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో రోజా గట్టెక్కారు. 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశం అంటూ చేసిన అభ్యర్థనతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైకాపా ఏకపక్ష విజయం సాధించింది. నగరిలో మాత్రం తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌పై 2వేల 708 మెజార్టీతో రోజా బయటపడ్డారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి రోజా సోదరులు... కుమారస్వామిరెడ్డి, రాంప్రసారెడ్డి, భర్త సెల్వమణి పెత్తనంతో పార్టీ క్యాడర్‌లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రతి పనికీ లంచాలు, కమీషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారని సొంత పార్టీ నేతలే బహిరంగ వేదికలపై విమర్శలకు దిగారు.

నగరి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లోనూ మంత్రి రోజాను వర్గపోరు ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. అసమ్మతి నేతలను కలుపుకొనేందుకు యత్నించకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఎన్నికల ముందు వరకు మంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన అసమ్మతి నేతలు నాయకులు రోజా అభ్యర్థిత్వం ఖరారయ్యాక వైకాపాను వీడి తెదేపాలో చేరారు. ఈ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకున్న తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌ ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. వైకాపాను వీడే నేతలకు అధినేత చంద్రబాబునాయుడుతో పార్టీ కండువా వేయిస్తుండగా... మరి కొందరితో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని రోజాను దెబ్బతీసే వ్యూహాలకు తెరతీశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోజా అక్రమాల పై విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు...

ప్రభుత్వంతో పాటు తనపై తారస్థాయికి చేరిన వ్యతిరేక పవనాలను గమనించిన రోజా.... ఆఖరి అస్త్రంగా ప్రలోభపెట్టే కుట్రలకు తెరతీశారు. పార్టీని వీడుతున్న నేతలను అడ్డుకునేందుకు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగాన్ని వినియోగించి తెదేపా నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారు.

Tags

Next Story