AMARAVATHI: అనుచిత వ్యాఖ్యలపై భగ్గుమన్న మహిళా లోకం

సాక్షి’ ఛానెల్లో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చలో.. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేశ్యల రాజధాని’ అంటూ వీవీఆర్ కృష్ణంరాజు అనే పాత్రికేయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. వైసీపీ మినహా మిగతా రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, పాత్రికేయ సంఘాల నాయకులు ఆ వ్యాఖ్యల్ని ముక్తకంఠంతో ఖండించారు. రైతులు, మహిళల నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలతో రాజధాని గ్రామాలు అట్టుడికిపోయాయి. రాజధాని రైతులు, మహిళలు కొందరు విజయవాడలోని కృష్ణంరాజు నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లారు. ఆయన అక్కడ లేరని తెలుసుకుని ‘సాక్షి’ పత్రిక కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. 24 గంటల్లో సాక్షి యాజమాన్యం క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కొమ్మినేని, కృష్ణంరాజులపై విజయవాడ, మంగళగిరి, కాకినాడ, సత్తెనపల్లి సహా రాష్ట్రంలోని పలు చోట్ల పోలీసుస్టేషన్లలో టీడీపీ నాయకులు, ప్రజలు ఫిర్యాదు చేశారు.
చిత్రపటాలకు చెప్పుదెబ్బలు
కృష్ణంరాజు, కొమ్మినేని తీరుపై అమరావతి మహిళలు, రైతులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తుళ్లూరులో వారి చిత్రపటాల్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. వారిద్దరితో పాటు, సాక్షి ఛానెల్పై పోలీసులు కేసు నమోదు చేయాలని, కొమ్మినేని, కృష్ణంరాజులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్స్టేషన్కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేశారు. పలు ప్రాంతాల్లో రైతులు మానవహారంగా ఏర్పడి ఆందోళన తెలియజేశారు. కృష్ణంరాజు, కొమ్మినేని చిత్రపటాలను దిష్టిబొమ్మకు అతికించి, దాన్ని దహనం చేశారు. అనంతరం మందడం సెంటర్లో చీపురుకట్టలతో నిరసన తెలియజేశారు. కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ రిజ్వానా ఆధ్వర్యంలో తాడికొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
కఠిన చర్యలు తప్పవన్న చంద్రబాబు
మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదని, రాజకీయ, మీడియా ముసుగులో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజధాని ప్రాంత మహిళలపై వికృత వ్యాఖలను ఆయన ఖండించారు. 'ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది. స్త్రీని ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం, భారతీయ జీవన విధానం. ముఖ్యంగా తెలుగు ప్రజల విషయానికి వస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెళ్లపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరం. వాళ్లు ఎప్పుడూ అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదనేది స్ఫష్టం అయ్యిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com